మాతో మాట్లాడలేదు.. అవమానంగా భావిస్తున్నాను: మమత

20 May, 2021 14:22 IST|Sakshi

కోల్‌కతా: కోవిడ్‌ నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 10 రాష్ట్రాల జిల్లా న్యాయాధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. తమతో మాట్లాడలేదని.. దీనిని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు మమత.

సమావేశం అనంతరం దీదీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు.. కానీ మాతో మాట్లాడలేదు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కేవలం కొందరు బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధాని చిన్న చిన్న ప్రసంగాలు చేశారు. సమావేశం ముగిసింది అన్నారు. ఇది చాలా సాధారణ సమావేశంగా అనిపించింది’’ అన్నారు.

‘‘ప్రధాని ప్రవర్తించిన తీరు మమ్మల్ని అవమానించినట్లుగా అనిపించింది. ఆయన టీకాల గురించి కానీ, రెమ్‌డెసివర్‌, బ్లాక్‌ ఫంగస్‌ కేసుల గురించి మాట్లాడలేదు. వ్యాక్సిన్‌ల కోసం డిమాండ్‌ చేయాలని భావించాం. కానీ మాకు మాట్లాడే అవకాశమే రాలేదు. గతంలో మాదిరిగానే ప్రధాని ఈ సారి కూడా కేసులు తగ్గుతున్నాయన్నారు. ఆయన చాలా అభద్రతాభావంతో ఉన్నారు. మేం చెప్పేది వినలేదు’’ అంటూ దీదీ మండిపడ్డారు

పశ్చిమ బెంగాల్‌తో సహా మరో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని అన్ని జిల్లాలు పాజిటివిటీ రేటు బాగా పెరిగింది. కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియాలను ఆందోళన జిల్లాలుగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.

చదవండి: Coronavirus: వ్యాక్సిన్‌.. కోవిడ్‌పై విన్‌

మరిన్ని వార్తలు