తెలంగాణ గురించి కేసీఆర్‌కే తెలియదా?: నిర్మలా సీతారామన్‌ ఫైర్‌

16 Feb, 2023 18:59 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో మెడికల్‌ కాలేజీల ప్రతిపాదనలపై నిర్మల.. కౌంటర్‌ ఇచ్చారు. మెడికల్‌ కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. 

వివరాల ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. మాపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటీ అని ప్రశ్నించారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. కాగా, కాలేజీలు ఉన్న జిల్లాలకే మళ్లీ ప్రతిపాదనలు పెట్టారు. తెలంగాణలో మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదా? అంటూ కామెంట్స్‌ చేశారు. రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదు. నోడేటా అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ సెటైర్లు వేశారు. 

ఇదే సమయంలో ఐదు ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ సీరియస్‌ అయ్యారు. 2014లో తెలంగాణలో అప్పులు రూ.60వేల కోట్లు. ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నాము.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాము. రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇది రాజ్యాంగం లో పొందుపరిచిన నిబంధన.. దానినే మేము అమలు చేస్తున్నాం. అప్పులపై ఎవరో ఒకరు మానీటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పాను. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ.. అక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చాం. అందరినీ ఒకేలాగా చూస్తాం.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాం. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా? అంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలి. ఇది దేశం కోసం అంటూ హితవు పలికారు.

మరిన్ని వార్తలు