నా భార్యకు భర్తగా కొడుకు పేరా? అధికారులపై ఈటల ఆగ్రహం

4 May, 2021 17:41 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: పార్టీలు ఉంటాయ్, పోతాయ్ వ్యక్తులు ఉంటారు పోతారు, కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొన్నారు. ఈటల జమున వైఫ్ ఆఫ్ నితిన్ అని రాశారని గుర్తుచేశారు. అధికారులకు కొడుకు ఎవరో, భర్త తెలియదు అన్నారు. ఆదరాబాదరా అయిన అర్థవంతమైన పని చేయాలని హితవు పలికారు.

ఐఏఎస్ చదువుకున్న అధికారులు, బాధ్యత గల రెవెన్యూ అధికారులు, రిపోర్ట్ చేసే అధికారులు ఎంతనీచంగా ప్రవర్తించారో అదొక్కటే ఉదాహరణ అని ఈటల రాజేందర్‌ తెలిపారు. కరీంనగర్‌లో మంగళవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల మాట్లాడారు. ‘జ్ఞానం పెట్టి రాయలే, డిక్టెషన్ చేస్తే రాసినట్టుంది. మళ్లీ చెబుతున్నా కనీసం తప్పు చేసినవని నోటీస్ ఇవ్వాలి, లేదా ఓ దరఖాస్తు వచ్చింది భూములను పరిశీలిస్తున్నాం, కొలుస్తున్నాం అని పిలవాలి. ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నా. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంతో నోరులేని వాళ్లకు, దిక్కులేని వారిని రాజ్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు కోర్టులు రాజ్యాంగ కాపాడుతుందని భావిస్తున్నాం.’ అని తెలిపారు.

‘ప్రభుత్వం నీచంగా ప్రవర్తించిందని త్వరలోనే తెలుస్తుంది. నేను ఎవరి గురించి కామెంట్ చేయను. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్. పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదు. కేటీఆర్‌ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. నేనే స్వాగతించాను.. 2002లో టీఆర్ఎస్‌లో చేరిన. 2004 నుంచి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశా’ అని ఈటల తెలిపారు. మంత్రులు చేసిన విమర్శలపై ఈటల స్పందిస్తూ.. ‘మాకు త్యాగమే లేదు, కమిట్‌మెంట్ లేదు, చీమలు పెట్టిన పుట్టలో పాములుదూరినట్లు చేరానని, మేకవన్నె పులి అంటున్నరు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని తెలిపారు.

‘ఎవరి చరిత్ర ఏమిటో ప్రజాక్షేత్రంలో ఉంది. నా పై కక్ష సాధించడం సరికాదు. ఎవరి మాటలపై స్పందించను. నాతో ఎవరేం మాట్లాడినారో నాకు తెలుసు. జిల్లాకు సంబంధించిన ఓ సమస్యపై తాను మంత్రిగా గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా సీఎంను కలుద్దామని ప్రగతిభవన్‌కు వెళ్లితే అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఆ సందర్భంలో సీఎంకు ఇంత అహంకారం ఉంటుందా అని గంగుల అన్నారు. అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడితే ఎలా? నేను ఎవరి గురించి మాట్లాడను, కామెంట్స్ చేయను’ అని స్పష్టం చేస్తూ సమావేశం ముగించారు. 

చదవండి: 
నోటీస్‌ ఇవ్వకుండా రాజ్‌భవన్‌పై కూడా విచారించొచ్చు

సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు