అప్పుడు చంద్రబాబు, మైసూరారెడ్డి ఎక్కడికి వెళ్లారు?

21 Jul, 2021 18:26 IST|Sakshi

చంద్రబాబుపై శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

సాక్షి, కడప: సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు రాయలసీమ నీటి కష్టాలను తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నపుడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట అని, ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతలపై తన విధానామేమిటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు.

గడికోట శ్రీకాంత్‌రెడ్డి బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘‘796 అడుగులు దాటకుండా తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే.. చంద్రబాబు, మైసూరారెడ్డి ఎక్కడికి వెళ్లారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు కాబట్టి భయపడ్డారా?.. పాలమూరు - రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు నీటిని తరలించి.. రాయలసీమను ఎందుకు ఎండగడుతున్నారు?రాయలసీమ హక్కులను కాపాడేందుకే మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగే వరకు పోరాటం చేస్తాం. శ్రీశైలంలో నీటి కేటాయింపులు జరిగినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో.. తెలంగాణ నీటిని తోడేస్తుంది..ఇది న్యాయమా’’ అని ప్రశ్నించారు.

‘‘నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్సార్‌, వైఎస్ జగన్‌లకు తప్ప.. ఏ ఒక్కరికీ చిత్తశుద్ధి లేదు.  రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? ట్రిబ్యునల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏ వైఖరి ఉందో.. చంద్రబాబు కూడా అదే ధోరణిలో వంత పాడుతున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు