కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. 20వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేస్తాం. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు చేసింది. దీన్ని అపార్ట్మెంట్లకూ వర్తింపజేస్తాం.
స్పందించాల్సిన అవసరం లేదు : కేటీఆర్
మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ బండి సంజయ్ మద్యంతర ఎన్నికల వ్యాఖలపై మాట్లాడుతూ.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పిచ్చోడి మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
104 స్థానాల్లో గెలుస్తాం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 104 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. సంక్షేమం, అభివృద్ధే తమ పార్టీని గెలిస్తాయాని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ పిచ్చి మాటలు మాట్లాతున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ కవిత
ఎల్బీ స్టేడియలో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ బస్సులో బయలు దేరారు.కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎల్బీ స్టేడియంకు ఆర్టీసీ బస్సులో ప్రజలతో బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత బస్సు స్టార్ట్ కావడానికి మోరాంచడంతో, ఆ ఆర్టీసీ బస్సు దిగి మరో ఆర్టీసీ బస్సులో సభకు బయలుదేరి వెళ్లారు
కేసీఆర్ సభకు భారీ బందోబస్త్
ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియం చుట్టూ పోలీస్ సిబ్బందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసు శాఖ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 50వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో హాజరకానునున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సభ జరగనుంది. కోవిడ్ నిబంధనల మధ్య సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని డివిజన్ల నుంచి భారీగా జన సమీకరణ జరుగుతోంది. ఎల్బీ స్టేడియం మొత్తం గులాబీమయమైంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రాత్రి 8గంటల వరకు ఎల్బీస్టేడియం వద్ద వాహన రాకపోకలకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సభలో సిఎం కేసీఆర్ ఆరేళ్లుగా హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు.