గ్రేటర్‌లో పోలింగ్‌ 45.71%

2 Dec, 2020 04:23 IST|Sakshi

ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వం , పోలీసు యంత్రాంగం

ఎప్పటిలాగే ముఖం చాటేసిన గ్రేటర్‌ ఓటర్లు

ఓటేసేందుకు బయటకు రాని వైనం

ఓల్డ్‌ మలక్‌పేటలో సీపీఐ గుర్తు తారుమారు

పోలింగ్‌ నిలుపుదల.. 3న రీపోలింగ్‌

4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 

ఫిబ్రవరి 10 తర్వాతే మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు? 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అయితే పూర్తి స్థాయి పోలింగ్‌ వివరాలను బుధవారం ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాలేదని తెలుస్తోంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ నమోదైంది. జీహెచ్‌ఎంసీలోని 149 డివిజన్ల పరిధిలో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ ఆద్యం తం మందకొడిగా సాగింది. కరోనా భయానికి తోడు పార్టీలు, నేతల తీరుపై సరైన అభిప్రాయం లేక చాలామంది ఓటేసేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఆయా డివిజన్లలో పోటీచేస్తున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది. పోలీసు  భద్రత నడుమ బ్యాలెట్‌ పెట్టెలను స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఓల్డ్‌ మలక్‌పేటలో రీపోలింగ్‌..
ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ (నంబర్‌ 26) లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలిని బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించాల్సి ఉండ గా, పొరపాటున సీపీఎం గుర్తు సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తు ముద్రించారు. సీపీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డివిజన్‌లో పోలింగ్‌ను నిలిపేసి 3న రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రీపోలింగ్‌లో ఓటర్ల మధ్య వేలుకు సిరా గుర్తు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క ఘటన మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కాగా, 3న రీపోలింగ్‌ నిర్వహిస్తుండడంతో ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఫిబ్రవరి 10 తర్వాతే..
ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తర్వా తే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్ర మాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆలోగా ప్రభుత్వం చట్ట సవరణలు తీసుకొస్తే మాత్రం ముందే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే అవకాశముంది. వారు ఫిబ్రవరి 10 తర్వాతే బా ధ్యతలు స్వీకరించాలి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 10 వరకు వేచి చూస్తే కొత్తగా ఎన్నికైనా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి వేరే పార్టీల వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

భయంతోనే ఓటర్లు రాలేదా?
సార్వత్రిక ఎన్నికల తరహాలో పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించడం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అక్కడక్కడ ఘర్షణలకు సైతం దిగడంతో.. పోలింగ్‌ రోజు అవాంఛనీయ ఘటన లు, ఉద్రిక్తతలు తలెతొచ్చని చాలామంది ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తోంది. అయితే చెదురు మదురు ఘటనలు తప్ప అంతటా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వ, పోలీస్‌ యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. కరోనా మహమ్మారి భయం వేధిస్తున్నా 48 వేల మంది పోలింగ్‌ సిబ్బంది, 52,500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించారు. 

మరిన్ని వార్తలు