తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్‌

5 Dec, 2020 08:32 IST|Sakshi

గ్రేటర్‌లో ఒక్క చోట కూడా డిపాజిట్‌ రాని పచ్చ పార్టీ

నాలుగో స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీని గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఆర్భాటానికి పోయి ఏకంగా 106 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపిన ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్‌ కూడా దక్కలేదు. హైటెక్‌ సిటీని తామే నిర్మించామని, చంద్రబాబు విజన్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందని డబ్బా కొట్టే పచ్చ పార్టీకి జీహెచ్‌ఎంసీ ప్రజలు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు. గ్రేటర్‌ పరిధిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఒక్క డివి జన్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించలేక పోయారు. ఇప్పటికే గ్రామీణ తెలంగాణలో దాదాపు కనుమరుగయిన తెలుగుదేశం పార్టీ, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో హైదరా బాద్‌లో ఖతం అయిందని, ఇక ఆ పార్టీ దుకాణం తెలంగాణలో బంద్‌ అయినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల సంద ర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ కూడా బోసిపోయింది. కనీసం ఒక్క నాయకుడు కూడా కార్యాలయానికి వచ్చి ఫలితాలపై ఆరా తీసే పరిస్థితి లేకుండా పోవడం గమనార్హం.  

తల్లీ, కొడుకు పోటీ.. చేజారిన సీటు
హయత్‌నగర్‌: వాళ్లిద్దరూ తల్లీ.. కొడుకులు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఒకే డివిజన్‌ నుంచి పోటీలో నిలిచారు. ఇందులో తల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాగా, కొడుకు స్వతంత్ర అభ్యర్థి. అయితే ఈ పోటీ చివరికి బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చింది. ఎలాగంటే... ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ముద్దగోని లక్ష్మీప్రసన్న, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె కొడుకు రంజిత్‌గౌడ్, బీజేపీ నుంచి మొద్దు లచ్చిరెడ్డి పోటీ చేశారు. ముద్దగోని లక్ష్మీప్రసన్నకు 11,406 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డికి 11,438 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 32 ఓట్ల తేడా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీప్రసన్న కొడుకు రంజిత్‌ గౌడ్‌కు 39 ఓట్లు వచ్చాయి. ఆ 39 ఓట్లు లక్ష్మీప్రసన్నకు వచ్చి ఉంటే ఆమెనే విజయం సాధించి ఉండేవారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తల్లీ.. కొడుకు పోటీలో ఉండడంతో స్వల్ప ఆధిక్యంతో బీజేపీ ఈ సీటును దక్కించుకుంది. 

సింగిల్‌ డిజిట్‌.. నాలుగో స్థానం
సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి కుదేలైంది. అధికార టీఆర్‌ఎస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చిత్తయింది. 150 డివిజన్లకు 146 చోట్ల పోటీ చేసి కేవలం 2 స్థానాల్లోనే గెలుపొంది నాలుగో స్థానానికి పరిమిత మైంది. గతంలోనూ కాంగ్రెస్‌కు జీహెచ్‌ఎంసీలో ఇద్దరే సభ్యులుండగా ఇప్పుడు కూడా ఇద్దరే గెలిచారు. ఓట్ల శాతం పరంగా చూస్తే గతంకన్నా కొంత మెరుగుపడ్డామని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు చెబుతున్నా... లభించిన స్థానాలు, గ్రేటర్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రదర్శన పేలవంగానే ముగిసిందని రాజకీయ ముఖచిత్రం వెల్లడిస్తోంది. మొత్తం బల్దియా పరిధిలో కేవలం 15–20 డివిజన్లలోనే ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్‌ పరిమితం కావడం టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నా యం తామేనన్న ఆ పార్టీ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

కనీస పోటీ ఏదీ?
గ్రేటర్‌ ఫలితాలపై కాంగ్రెస్‌ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజ యం సాధించి దూకుడు మీద ఉన్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించు కోవాలని, తద్వారా రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌కు దీటుగా నిలబడేది తామేనని ప్రజలకు సంకేతం ఇవ్వాలని ఆశిం చారు. కానీ అందుకు భిన్నంగా గ్రేటర్‌ తీర్పు రావడంతో భవిష్యత్తుపై కూడా ఆ పార్టీ నేతలకు బెంగ పట్టుకుంది. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహి స్తున్న మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఉన్న 47 డివిజన్లు, ఇతర శివారు స్థానాల్లో సత్తా చాటగలమని, పార్టీ కేడర్‌ బలంగా ఉన్నందున కనీసం డబుల్‌ డిజిట్‌ స్థానాల్లో విజ యం దక్కు తుందని కాంగ్రెస్‌ నేతలు లెక్కలేసు కున్నారు. అదే ధీమాతో ఎన్ని కలను ఎదుర్కొన్నారు. కానీ రేవంత్‌ కోటలోనూ కాంగ్రెస్‌ కంగు తింది. మైనార్టీలు, సెటిలర్లు, శివారు కాలనీల్లోని బస్తీల ప్రజలు తమకు అండగా నిలుస్తారనే కాంగ్రెస్‌ అంచ నాలు తారుమారు కావడంతో ఆ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత భట్టి, ముఖ్య నాయకులంతా గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది.

భవిష్యత్తు ఏమిటో..?
గ్రేటర్‌ ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను పునరాలోచనలో పడే స్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్‌ ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రూపుదిద్దు కుంటోందనే చర్చలు ఆ పార్టీ నేతల భవిష్య త్తుపై గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో జరగ బోయే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక విషయంలో ఏం జరుగు తుందో ననే ఆందోళన వారిలో వ్యక్తమవు తోంది. ఇక్కడ కూడా ఇవే ఫలితాలు పునరావృ తమైతే తామిక మూడో స్థానంలో సెటిల్‌ కావడం ఖాయమేనని ఆ పార్టీ నేతలు బహిరంగం గానే వ్యాఖ్యానిస్తు న్నారు. పార్టీ ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ప్రజలపక్షాన దూకుడుగా వ్యవహరించా లని, లేదంటే ఎన్ని ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం వస్తుం దని వారంటున్నారు. మరి గ్రేటర్‌ తీర్పుతో కాంగ్రెస్‌ ఏం మారుతుందో.. ప్రత్యామ్నా యం దిశగా ఏ మేరకు ముందు కెళ్తుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు