బీజేపీలో ముసలం.. ప్లాన్‌ మార్చిన కేసీఆర్‌

17 Nov, 2020 19:18 IST|Sakshi

తొలి జాబితా ప్రకటన ముందే బీజేపీ ఆశావహుల ఆందోళన

బీజేపీ తొలి జాబితా సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవ్వడంతో రాజధానిల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్‌కు సమానంగా విపక్షాలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ సమావేశాలతో కారు పార్టీకి సవాలు విసురుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలకు అందరికంటే ముందుగా టీఆర్‌ఎస్‌ సిద్ధమైనప్పటికీ.. తామేమీ తక్కువ కాదంటూ కాషాయదళం దూసుకొస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను సిద్ధం చేసింది. మంగళవారం రాత్రి, లేదా బుధవారం ఉదయం మొదటి జాబితాను విడుదల చేయనుంది. అయితే ఎవరూ ఊహించన విధంగా బీజేపీలో టికెట్‌ల కోసం అభ్యర్థులు ఎగబడుతున్నారు. తమకంటే తమకే సీటు దక్కాలని పోటీపడుతున్నారు. మొదటి జాబితా ప్రకటించముందే తమకు టికెట్‌ ఇవ్వాలంటూ నిరసనకు దిగుతున్నారు. (దుబ్బాక దెబ్బ: కేసీఆర్‌ వ్యూహం మార్చుతారా?)

బీజేపీలో గ్రేటర్ ముసలం..
అయితే ఇప్పటికే ప్రకటనకు సిద్ధమైన జాబితా లీకవ్వడంతో కాషాయ పార్టీలో ముసలం రాజుకుంది. సొంతవారికి టికెట్స్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోశామహల్ టికెట్‌ను సీనియర్‌ నేత లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి వచ్చిన తన బావమరిదికి కేటాయిచడం పట్ల కార్యకర్తల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ్ కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యాలయం ముందు నినాదాలు చేస్తున్నారు. జియగూడా టికెట్ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు తనయుడు సాయికి కేటాయించడం కూడా వివాదంగా మారింది. మరోవైపు బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి తన వర్గానికి రెండు మూడు డివిజన్లు  కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామం బీజేపీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. (రేవంత్‌కు పీసీసీ పగ్గాలు..!)

నామినేషన్ల పరిశీలన రోజున బీఫామ్‌లు..
మరోవైపు జీహెచ్‌ఎంసీ అభ్యర్ధులపై చర్చించేందుకు ఏర్పాటైన టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయనున్నారు. సిట్టింగ్‌ సభ్యులకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉంది. 15 నుంచి 20 సీట్లలో మార్పులు చోటు చేసే అవకాశం కూడా ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే గతంలా కాకుండా ప్లాన్‌ మార్చిన కేసీఆర్‌ నామినేషన్ల పరిశీలన రోజున బీఫామ్‌లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఎన్నడు లేని విధంగా ముందుగా బీఫామ్‌లు ఇవ్వకూడదని నిర్ణయించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడు పెంచింది. బుధవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. హడావుడిగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ప్రకటించడం దురదృష్టకరమన్నారు. కేవలం 13 రోజుల్లో ఎన్నికల హడావిడి ముగించే ప్లాన్ చేయడమేంటి? అని ప్రశ్నించారు.


బీజేపీ తొలి జాబితా
మైలార్ దేవ్ పల్లి- తోకల శ్రీనివాస్‌రెడ్డి
కేపీహెచ్‌బీ- ప్రీతమ్ రెడ్డి
ఫతేనగర్ - కృష్షగౌడ్
గడ్డిఅన్నారం- కాసం రాంరెడ్డి
ఖైరతాబాద్- సింగారి వీణామాధురి, 
మన్సురాబాద్- కొప్పుల నరసింహారెడ్డి
వనస్థలిపురం- పవన్, 
లింగోజిగూడ- జిట్టా సురేందర్ రెడ్డి
బీఎన్ రెడ్డి- వెంకటేశ్వర రెడ్డి
హిమాయత్‌నగర్-తులసి లేదా రామన్ గౌడ్
నాగోల్- సురేందర్ యాదవ్
మాదాపూర్- వినయ్ బాబు
గౌలిగూడ- ఆలే సుజాత
గాంధీనగర్- వినయ్ లేదా భరత్ గౌడ్
షేక్‌పేట- రవికుమార్ నాగుల
ముసారంబాగ్- విజయ్ కాంత్
హయత్ నగర్-  కల్లెం రవీందర్ రెడ్డి
జీడిమెట్ల- తారా చంద్రారెడ్డి
సురారం- శంకర్ రెడ్డి
రంగారెడ్డి- నందనం దివాకర్
జియాగూడ- ఎస్సీ కమిషన్ మాజీ‌ సభ్యుడు రాములు తనయుడు

(రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం)

మరిన్ని వార్తలు