కేంద్ర రూపాయి కూడా ఇవ్వలేదు: తలసాని

18 Nov, 2020 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ వరదలపై పక్క రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం 4,75,781 మందికి నేరుగా వరదసాయం అందజేసిందని మంత్రి తెలిపారు. అనంతరం మీసేవ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించామని, గత మూడురోజుల్లో రూ. 165 కోట్లు మీసేవ ద్వారా వరద బాధితులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ వరదసాయం నిలిపివేసినా, ఫలితాల అనంతరం ఈ మొత్తాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నేను ఫైటర్‌ని.. దేనికి భయపడను : కేసీఆర్‌)

ప్రజలు ఆలోచించాలి
‘‘ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలే తేల్చుతారు. స్వాతంత్రం వచ్చాక ఇక్కడ ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది. వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏమి చేసిందో హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. దేశంలోని ప్రతీ ఒక్కరూ నగరం వైపు చూస్తున్నారు. ఆధునాతన రోడ్లు, సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. భారతదేశంలో మేము కట్టిన ఇళ్లు ఎవరూ కట్టలేదు’’ అని మంత్రి తలసాని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఇక దుబ్బాకలో బీజేపీ విజయం నేపథ్యంలో... ఒక ఎన్నిక గెలిచిన్నంత మాత్రాన మొత్తం అదే ప్రపంచం అనుకుంటే ఎలా అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్నిరకాలుగా అడ్డుపడినా, ఎన్నికల తర్వాత ప్రజలకు వరద సాయం అందిస్తామని వెల్లడించారు. 

పోటీ చేయడం లేదు
గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో తమ ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రజాస్వామ్యం లో పోటీ చేసే హక్కు అందరికి ఉంటుందని, మేయర్ అభ్యర్థిపై తమకు ఆశలు లేవని పేర్కొన్నారు.  చిన్న వయసులోనే తన కుమారుడికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని, అదే ఎక్కువగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో  సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ బరిలో నిలపగా, ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు