Goa Congress: గోవా కాంగ్రెస్‌లో ముసలం.. చెన్నైకి ఐదుగురు ఎమ్మెల్యేల తరలింపు

16 Jul, 2022 18:35 IST|Sakshi

పనాజీ: దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలో గోవా కాంగ్రెస్‌లో ఫిరాయింపు వార్తలు కలకలం సృష్టించాయి. పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైంది కాంగ్రెస్‌ అధిష్ఠానం. గోవాకు చెందిన ఐదుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలను శనివారం చెన్నైకి తరలించింది. 

చెన్నైకి తరలించిన గోవా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో.. సంకల్ప్‌ అమోంకర్‌, ఆల్టోన్‌ డికోస్టా, కార్లోస్‌ ఆల్వారెస్‌, రుడాల్ఫ్‌ ఫెర్నాండెజ్‌, యూరి అలెమోలు ఉన్నారు. సంకల్ప్‌ అమోంకర్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉప నేతగా కొనసాగుతున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌, మైకెల్‌ లోబోలు పార్టీలోని మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకుని పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను తరలించటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

గోవా కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ దినేశ్‌ గుండూరావు తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఇచ్చిందని ఇటీవలే ఆరోపణలు చేశారు. మరోవైపు.. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను మైకెల్‌ లోబో ఖండించారు. అలాంటి ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మైకెల్‌ లోబోను గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా నుంచి తొలగించింది కాంగ్రెస్‌. లోబో, కామత్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. 

ఇదీ చదవండి: PM Narendra Modi: ఎన్నికల్లో ‘ఉచిత హామీలు’ దేశాభివృద్ధికి ప్రమాదకరం

మరిన్ని వార్తలు