TMC: టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం

29 Sep, 2021 18:25 IST|Sakshi

కోల్‌కతా: కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌లో తీవ్ర అనిశ్చితి ఏర్పడిన విషయం తెలిసిందే. పార్టీలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ అలా ఉండగా ఇప్పుడు గోవాలో కూడా పరిస్థితులు సమస్యగా మారాయి. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నాయకులు బై బై చెప్పేశారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పలువురు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరిగా తిరిగి టీఎంసీలో చేరుతున్నారు.

అయితే తాజాగా గోవాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం లుయిజిన్హో ఫలీరో టీఎంసీలో చేరారు. బుధవారం సీఎం మమతా బెనర్జీ, పార్టీ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ, రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ సమక్షంలో లుయిజిన్హో టీఎంసీ కండువా కప్పుకున్నారు. లుయిజిన్హో తన అనుచరుల బృందంతో కలిసి కోల్‌కతాలో టీఎంసీలో చేరారు. ఆయన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లుయిజిన్హో టీఎంసీలో చేరికపై సీఎం మమతా స్పందిస్తూ.. లుయిజిన్హోను టీఎంసీలోకి ఆహ్వానించటం గర్వంగా ఉందని తెలిపారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు టీఎంసీ స్వాగతం పలుకుతోందని తెలిపారు. తాము ప్రతి గోవా పౌరుడికి అండగా నిలబడతామని, అదేవిధంగా విభజన శక్తులతో పోరాడతామని పేర్కొన్నారు. సరికొత్త గోవాను రూపొందించటం కోసం కలిసి కృషి చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శులు యతీష్ నాయక్, విజయ్ వాసుదేవ్ పోయి, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శులు మారియో పింటో డి సంతాన, ఆనంద్ నాయక్, మరో ఐదుగురు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత, కవి శివదాస్ సోను నాయక్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నాయకుడు లావూ మమ్లేదార్ లుయిజిన్హో ఫలీరో పాటు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.

మరిన్ని వార్తలు