ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు తీస్తారు
పవన్.. జనవాణి కాదు.. ఉత్తరాంధ్రపై మీ వాణి ఏంటో చెప్పండి
జనవాణిలో ప్రజలే నిలదీస్తారు
‘గర్జన’ దృష్టిని మరల్చేందుకే పర్యటన: మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పేకలో జోకర్లా పవన్కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సర్క్యూట్ హౌస్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన విశాఖ.. మన రాజధాని పేరుతో నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జన పిలుపు మేరకు తామంతా మద్దతు పలుకుతున్నామన్నారు.
ఈ నెల 15న గర్జన పిలుపుతో ఉలిక్కిపడిన చంద్రబాబు.. దాన్ని తప్పుదోవ పట్టించేందుకు తన జోకర్ పవన్కల్యాణ్ను బరిలోకి దింపుతున్నాడని విమర్శించారు. గాజువాకలో చిత్తుచిత్తుగా ఓడించినందుకే పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంపై ద్వేషం పెంచుకున్నారన్నారు. పవన్ను చంద్రబాబు ఎక్కడపడితే అక్కడ వాడుకుంటారని, బాబు డైరెక్షన్లో పనిచేస్తున్న పవన్కు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటుందని తాము భావించడం లేదని అభిప్రాయపడ్డారు.
జనవాణి సాకుతో విశాఖ వస్తున్న పవన్ కల్యాణ్, ముందు.. వికేంద్రీకరణపై తన వాణి ఏమిటో స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. 16న నిర్వహించే జనవాణికి వచ్చే పవన్ను వికేంద్రీకరణపై ఉత్తరాంధ్ర ప్రజలే నిలదీస్తారన్నారు. ఈ ప్రాంత ఆలోచనల్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు చేపడుతున్న విశాఖ గర్జన విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తామంతా వికేంద్రీకరణ కోసం గర్జిస్తుంటే.. పవన్ మాత్రం.. బాబు వెనక పిల్లిలా మ్యావ్ మ్యావ్ అని భజన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
సినిమాలో వచ్చే రెమ్యూనరేషన్ కంటే చంద్రబాబు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉందని, అందుకే పవన్ సినిమా కాల్షీట్ల కంటే బాబు పొలిటికల్ కాల్షీట్లకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 25 జిల్లాలను ఒక్కో రాజధానిగా చేయండని సలహా ఇచ్చిన పవన్కు.. రాష్ట్రంలో 26 జిల్లాలున్నాయన్న జ్ఞానం కూడా లేకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మంచి జరగాలన్న నినాదం, విధానంతో ప్రభుత్వం ముందుకువెళ్తుంటే.. పవన్ కల్యాణ్ విశాఖ వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దండయాత్రకు వస్తున్న అమరావతి రైతులకు పైలట్గా ముందుగా పవన్ వస్తున్నారనీ.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గుర్తించి ఇప్పటికైనా తన పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిదని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.
ఆయనకు రాజధానులు కంటే రాణిధానుల గురించే ఎక్కువ ఆసక్తి ఉంటుందనీ.. ఇప్పటికే పవన్కు అంతర్జాతీయ రాజధానిగా మాస్కో, జాతీయ రాజధానిగా ముంబై, పక్కనే హైదరాబాద్ ఉన్నాయని చురకలంటించారు. ఫెడరల్ సిస్టమ్ గురించి తెలీని పవన్ లక్షా 80 వేల పుస్తకాలు చదివారా.? లేదా అందులోని బొమ్మలు మాత్రమే చూశారా అనే అనుమానం వస్తోందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.