Gudivada Amarnath: ప్రజల దృష్టి మరల్చేందుకే బాబు క్షుద్ర రాజకీయం 

18 Sep, 2021 08:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయానికి తెర తీశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. ఓటమి భయంతోనే గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడితో సీఎం వైఎస్‌ జగన్‌ను అసభ్యంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు.

ఉండవల్లిలోని అక్రమ నివాసంలో ఉంటూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడికి దిగడం దారుణమన్నారు. చంద్రబాబు తన కాపలాకుక్క బుద్ధా వెంకన్న, కాల్‌మనీ బ్యాచ్, టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడి చేయించడంతోపాటు జోగి వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు.

ఇప్పటికైనా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. సీఎం వైఎస్‌ జగన్, మంత్రులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబును తిరగనివ్వబోమన్నారు. గంజాయి డాన్‌గా అయ్యన్న కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని.. అందులో చంద్రబాబుకు వాటా ఇచ్చారని విమర్శించారు. అయ్యన్నకు, పిచ్చికుక్కకు ఏమీ తేడా లేదన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం పెగ్గు వేస్తే తప్ప.. పనిచేయలేకపోయేవారని టీడీపీ నేతలే చెప్పేవారన్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా పెగ్గు వేస్తున్నారేమోనన్నారు.   

అయ్యన్న తినేది అన్నమేనా? 
అయ్యన్న అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. అయ్యన్న అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచి్చనట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో దళితులను అవమానించారన్నారు.

బీసీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే తోకలు కత్తిరిస్తానని హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. జోగి రమే‹Ùపై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.  దిశ ప్రతులు తగలబెట్టిన లోకేష్‌ కూడా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు