YSRCP Plenary 2022: కొడాలి ఒక బ్రాండ్‌.. దెబ్బకు బాబుకు నిద్ర పట్టడం లేదు

28 Jun, 2022 13:49 IST|Sakshi
గుడివాడ ప్లీనరీలో పేర్ని నాని

YSRCP Plenary Meeting 2022 సాక్షి, కృష్ణా జిల్లా: కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని.. మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్నినాని పేర్కొన్నారు. 

మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న పేర్నినాని.. ‘‘కొడాలి నాని దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. నేను సీఎంని అవుతా.. సీఎం జగన్‌ను దించేస్తా అనే స్థాయి నుంచి.. ఇవాళ నానిని ఓడిస్తా అనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. కానీ, ఇప్పుడు గుడివాడకు కొడాలి నాని ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌. కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి.. ముందు పోటీకి ఎవరైనా అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి. కొడాలి నానికి భయపడి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. బాబే కాదు.. ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరు. 

పేదలకు ఇచ్చిన ఇంటిని నారా లోకేష్‌ బాత్‌రూమ్‌తో పోలుస్తున్నాడు. అక్రమ సంపాదనతో పెద్ద బాత్రూం కట్టించుకున్నావ్‌ కాబట్టే అలా మాట్లాడుతున్నావ్‌. పేదల సొంతింటి కల నెరవేర్చిన.. గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని పేర్ని నాని ప్రసంగించారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని, దీన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిందని.. మరో పాతికేళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పారాయన. చంద్రబాబు తన దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చినా.. కొడాలి నానిని ఓడించలేరని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు