Gujarat assembly elections 2022: కాంగ్రెస్‌కు గిరిజనులంటే గౌరవం లేదు: మోదీ

28 Nov, 2022 06:10 IST|Sakshi

నెత్రంగోడా: కాంగ్రెస్‌ పార్టీకి గిరిజనులంటే ఏమాత్రం గౌరవం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సైతం ఆ పార్టీ బలపరచలేదని పేర్కొన్నారు. ‘బిర్సా ముండా, గోవింద్‌ గురు వంటి గిరిజన నేతలను కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. ముర్ముకు మద్దతివ్వాలని రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆ పార్టీని చేతులు జోడించి వేడుకున్నా కాదన్నారు. గిరిజన పుత్రికను రాష్ట్రపతిని చేసేందుకు సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది’ అన్నారు.

గుజరాత్‌లోని ఖేడా, భరుచ్‌ జిల్లాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మొబైల్‌ బిల్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండేదన్నారు. దేశంలో భారీ ఉగ్రదాడుల సమయంలో మౌనంగా ఉండటం ద్వారా కాంగ్రెస్, సారూప్య పార్టీలు తమ  ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ మారలేదు. దేశాన్ని కాపాడుకోవాలంటే అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలి’అని ప్రధాని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు