అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు.