కేజ్రీవాల్‌పై రాయితో దాడి.. నేనేం తప్పు చేశా? అని ప్రశ్నించిన ఆప్ అధినేత

29 Nov, 2022 10:42 IST|Sakshi

సూరత్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ‍ప్రచారంలో భాగంగా ఆయన సూరత్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చేశాడు. అయితే కేజ్రీవాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. 

ఈ విషయంపై కేజ్రీవాల్ స్పందించారు. ప్రత్యర్థులు తన కన్ను పోగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని  దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మిస్తామని తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మహిళలు, యువతలో విశేష స్పందన లభిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మొత్త 182 సీట్లకు 92 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై చేసిన దాడిలో ఓ చిన్నారి గాయపడినట్లు ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా తెలిపారు. బీజేపీ గూండాలే ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపించారు.

మరోవైపు కేజ్రీవాల్‌పై దాడి జరగలేదని గుజరాత్ పోలీస్ అధికారులు చెప్పారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతతో రోడ్‌షో జరిగిందని పేర్కొన్నారు. అయితే సూరత్‌లో కేజ్రీవాల్ ర్యాలీ సమయంలో ఆప్, బీజేపీ కార్యకరక్తల మధ్య తోపులాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. ‍తామ వెంటనే పరిస్థితిని అదుపు చేశామన్నారు.
చదవండిఆకాశంలో సగం.. అవకాశాలే గగనం!

మరిన్ని వార్తలు