ముస్లింల సమస్యలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు

12 Nov, 2020 04:11 IST|Sakshi

సలామ్‌ కుటుంబం ఆత్మహత్యపై తప్పుడు ప్రచారం తగదు 

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ 

కర్నూలు(రాజ్‌విహార్‌) /సెంట్రల్‌:  మాజీ సీఎం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ మండిపడ్డారు. ఆయన హయాంలో ముస్లింలను పావులా వాడుకుని వదిలేశారు తప్ప ఏనాడూ వారి బాగోగుల గురించి ఆలోచించలేదన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం స్పందించి.. ఐపీఎస్‌ అధికారులతో విచారణ కమిటీ వేశారన్నారు.

బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా బాధితులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారన్నారు.  చంద్రబాబు టీడీపీకి చెందిన లాయర్‌తో నిందితుల తరఫున వకాల్తా ఇప్పించారని విమర్శించారు. ఎన్‌ఎండీ ఫరూక్, లాల్‌జాన్‌ బాషా, అబ్దుల్‌ ఘనీ కుటుంబాలకు పదవులేవీ ఇవ్వని చంద్రబాబు తీరా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఫరూక్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. కానీ సీఎం జగన్‌ ముస్లింలకు రంగాల్లో పెద్దపీట వేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. 

మరిన్ని వార్తలు