పెన్షన్లలో కేంద్రం వాటా ఎంత? 

14 Oct, 2020 08:39 IST|Sakshi

చిటికెడు ఉప్పేసి పప్పంత నాదే అంటున్న బీజేపీ: హరీశ్‌రావు  

దుబ్బాకలో కాంగ్రెస్‌కు తొవ్వ చూపించే వారే లేరని ఎద్దేవా  

సాక్షి, సిద్దిపేట: వెనుకటికి పప్పులో చిటికెడు ఉప్పువేసి పప్పంతా నాదే అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి ఏడాదికి రూ.11,720 కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.210 కోట్లు మాత్రమే కేటాయించి పెన్షన్‌ డబ్బులు తామే ఇస్తుందని ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. వేమలఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్‌తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం చూస్తే వారి తరపున కోర్టుకు వెళ్లింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ప్రశ్నించారు. దీంతో వారికి పరిహారం, ఇతర సదుపాయాలు ఆలస్యమయ్యాయని చెప్పారు.    

టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరు 
ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఆపేశక్తి ఎవరికీ లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో సుజాతకు ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని చూసిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులకు మైండ్‌ బ్లాక్‌ అవుతోందని చెప్పారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ నేతలకు తొవ్వ చూపించే నాథుడే కరువయ్యారని ఎద్దేవా చేశారు. 
(చదవండి: దుబ్బాక: ఎన్నికల ప్రచారం రసవత్తరం)

మరిన్ని వార్తలు