‘పోత బిడ్డో సర్కారు దవాఖానకు అనేట్టుగా ఉంది’

29 Sep, 2020 14:55 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్, 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయని, కానీ ఎక్కడా లేని విధంగా  కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తోందని తెలిపారు. నిరుపేదలకు ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తోందని పేర్కొన్నారు. దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
(చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల)

తెలంగాణ వచ్చాక ఎక్కడా తాగునీటి సమస్య లేదని స్పష్టం చేశారు. తొలి కాన్పు తల్లి గారే చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ. 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తోందని చెప్పారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందించామని గుర్త చేశారు. త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతామని వ్యాఖ్యానించారు.

దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ‘ఇతర పార్టీల నేతలు డబ్బాల్లో రాళ్లు వేసి ఉపేది ఊపుతున్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు, కానీ నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టుగా తెలంగాణ సర్కారు పని చేస్తోంది. ఇప్పటిదాకా 7 లక్షల మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 5555 కోట్ల రూపాయలు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కే దక్కింది’అని హరీష్‌ పేర్కొన్నారు.
(చదవండి: మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ )

మరిన్ని వార్తలు