శవ రాజకీయాలు చేస్తున్న విపక్షాలు 

31 Jul, 2020 03:58 IST|Sakshi

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ధ్వజం

నర్సింలు మృతికి కాంగ్రెస్‌దే బాధ్యత

భూమి లాక్కొని మాపై నిందలా?

గజ్వేల్‌ రూరల్‌: ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నా యని మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వర్గల్‌ మండలం వేలూరులో రైతు బ్యాగరి నర్సింలు తన భూమిని రైతు వేదిక కోసం తీసుకుంటున్నారని ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని మంత్రి ఆరోపించారు. కాంగ్రె స్‌ అధికారంలో ఉన్నప్పుడు వర్గల్‌ మండలం వేలూరులో రాజేశంగౌడ్‌ 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్నట్లు గుర్తించిన అప్పటి ఎమ్మార్వో శ్రీనివాస్‌.. అందులో నుంచి ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఇందులో నుంచి 36 గుంటల స్థలంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టారని, మిగిలిన 16 గుంటల ఈ స్థలాన్ని రైతు వేదిక కోసం తీసుకున్నామని వివరించారు. కొంద రు ప్రలోభాలకు గురిచేయడంతోనే నర్సింలు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. రాజేశంగౌడ్‌ కబ్జాలో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. నర్సింలు మృతిపై విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మృతుడి కుటుంబానికి ఎకరం భూమితో పాటు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, పిల్లల చదువుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.  

మరిన్ని వార్తలు