TS: 50 వేల మెజార్టీతో గెల్లు గెలుపు ఖాయం

13 Sep, 2021 03:45 IST|Sakshi
అంకంపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌

వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌

భవిష్యత్తులో సంగారెడ్డి వరకు 

మల్లన్నసాగర్‌ జలాలు తరలింపు 

హుజూరాబాద్‌/సిద్దిపేటరూరల్‌: హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ 50 వేల మెజార్టీతో గెలుస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని జమ్మికుంట రోడ్‌లో ఆదివారం మున్నూరుకాపు భవనానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి భూమిపూజ చేసిన అనంతరం వారి ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ప్రజలకు చేసిందేమీ లేకనే హుజూరాబాద్‌లో బొట్టు బిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమెషీన్లు, గ్రైండర్లు పంచుతున్నారని, ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం మున్నూరుకాపు సంఘం నాయకులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానపత్రాన్ని మంత్రికి అందజేశారు.  

కేంద్రానికి రైతుల ఉసురు 
రైతు వ్యతిరేక చట్టాల అమలు, దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయమని చెప్పడం, డీజిల్‌ ధరల పెంపు, మార్కెట్ల ఎత్తివేత వంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రం మొండిపట్టుదలకు పోతుందని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా రూరల్‌ మండలం చింతమడక మధిర గ్రామం అంకంపేటలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డి వరకు మల్లన్నసాగర్‌ జలాలను తరలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావు, సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బాలకిషన్‌రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు