ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కోర్టుకు కూడా లేదు

19 Feb, 2021 19:27 IST|Sakshi

ఏకగ్రీవాలపై హై కోర్టు న్యాయవాది జనార్ధన్‌ రెడ్డి

సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఏకగ్రీవాల పరంపర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగేలా ఉంది. కోవిడ్‌ కారణంగా 2020 మార్చి 15న వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్‌ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసిన సమయంలో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్వరలోనే ఎస్‌ఈసీ ఈ ఎన్నికలు నిర్వహించాaని భావిస్తుండగా.. గతంలోని ఏకగ్రీవాలను రద్దు చేయాలని భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఫారం 10లో.. ఎన్నికల్లో గెలిచినవారికి ఫారం 23లో ధ్రువీకరణ ఇస్తారు. ఏకగ్రీవమైనా.. ఎన్నికల్లో గెలిచినా.. ఒకసారి ధృవీకరణ పత్రం ఇచ్చాక రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎస్‌ఈసీ, కోర్టులకు కూడా దీన్ని రద్దు చేసే అధికారం లేదు. కేవలం ఓడిపోయిన వ్యక్తి మాత్రమే ఆర్టికల్‌ 329 ప్రకారం జిల్లా కోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ వేసుకోవాలి. విచారణ తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది’’ అని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు