దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు

30 Aug, 2021 08:44 IST|Sakshi

హుజూరాబాద్‌కు ఈటల ఏం చేశారు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

హుజూరాబాద్‌: ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అసలు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఏం చేశారో చూపించాలని అన్నారు. ఆదివారం హుజూ రాబాద్‌ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో పీఆర్డీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించినందుకు కృతజ్ఞతసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అభివృద్ధిని మరిచారని అన్నారు. నియోజకవర్గానికి వైద్య కళాశాల కోసం రాజీనామా చేశారో.. పీజీ కళాశాల కోసం రాజీనామా చేశారో ప్రజలకే సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో 60 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పనిచేసినప్పుడు కృతజ్ఞతతో ఉండడం అనేది మంచి దృక్పథమని హితవు పలికారు. అలాంటివి చేసినప్పుడు రాజకీయ నాయకులకు కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లుగా అవుతుందన్నారు. (చదవండి: కేసీఆర్‌ అహంకారాన్ని బొంద పెట్టేది హుజురాబాద్‌ ఎన్నిక)

పీఆర్టీయూ లక్ష్యం.. ప్రభుత్వ లక్ష్యం ఒకటనని.. రాష్ట్రంలోని ఉద్యోగులను సీఎం కేసీఆర్‌ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ వేతనం ఇచ్చేది బీజేపీ పాలిత గుజరాత్‌ అని, అత్యధిక జీతాలు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండి టీఆర్‌ఎస్‌ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా అధ్యక్షుడు పొలంపల్లి ఆదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముస్కు తిరుపతిరెడ్డి, నాయకులు రవికుమార్, రాధాకృష్ణ, శివారెడ్డి, మధు, తిరుపతి, లక్ష్మారెడ్డి, రాజేంద్రప్రసాద్, మల్లేశ్, ప్రభాకర్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది

మరిన్ని వార్తలు