ప్రజల విశ్వసనీయత కోల్పోయిన కేసీఆర్‌

10 Jan, 2022 09:22 IST|Sakshi

ఆయనకు పోలీసులు తప్ప ఎవరి మద్దతూ లేదు

సీఎం కేసీఆర్‌పై అస్సాం సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ ధ్వజం

సాక్షి, వరంగల్‌: నైజాంలను మించిన నిరంకుశ పాలనతో సీఎం కేసీఆర్‌ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఇప్పుడాయనకు పోలీసులు తప్ప ఎవరి మద్దతూ లేదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నేత హిమంత్‌ బిశ్వ శర్మ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్‌ రోడ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిలో లక్షమందికి ఉద్యోగాలను కల్పించగా, కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగులను పరేషాన్‌ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దన్న సీపీఎం తదితర పార్టీలను ఇంటికి పిలిచి కేసీఆర్‌ దావత్‌ ఇచ్చారని, రాష్ట్రం ఏర్పాటు ఆశయానికి విరుద్ధంగా వెళుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను చూసి ఏదైనా నేర్చుకుందామని వచ్చానని, కానీ నేర్చుకోవడానికి ఇక్కడ ఏం లేదన్నారు. 

కేసీఆర్‌కు ఇక జైలే: సంజయ్‌
సీఎం కేసీఆర్‌ను కచ్చితంగా జైలుకు పంపిస్తామని, సొరంగంలో దాక్కున్నా వదలబోమని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 13 జిల్లాల్లోని ఉద్యోగులకు జీతాలు రాలేదని పేర్కొన్నారు. గూగుల్‌లో వేస్ట్‌ ఫెలో ఆఫ్‌ ఇండియా అని కొడితే కేసీఆర్‌ పేరే వస్తోందని ఎద్దేవా చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా త్వరలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. ఇక.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని మాజీమంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు