దళితబంధును ఆపాలని నేను లేఖ రాసినట్లు సృష్టించారు: ఈటల

21 Oct, 2021 10:19 IST|Sakshi

వీణవంక(హుజూరాబాద్‌): ‘బడ్జెట్‌లో ఐదు పైసల బిల్ల కూడా పెట్టకుండా దళిత బంధు ఎలా వచ్చింది? ఓట్ల కోసమే ఈ స్కీం తెచ్చారు’అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఈ స్కీంను ఆపాలని తాను లేఖ రాసినట్లు దొంగ లేఖలు సృష్టించారని, ఎన్నికల కమిషన్‌ కూడా ఈ దొంగ లేఖలను ఖండించిందని, ఇప్పుడు తన వల్లనే దళిత బంధు ఆగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేతలపై ఈటల విరుచుకుపడ్డారు.

వీణవంక మండలంలోని రెడ్డిపల్లి, కిష్టంపేట, ఘన్ముక్కుల, బ్రహ్మణపల్లి, రామక్రిష్ణాపూర్‌ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళిత బంధు తాను ఆపినట్లు నిరూపిస్తే తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి వస్తానని సవాల్‌ విసిరారు. అన్నీ కులాల్లోని పేదలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కొట్లాడుతానని, కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: లక్ష్మణ్‌ 
సాక్షి, న్యూఢిల్లీ: హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని, డబ్బు పంపిణీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతల బృందంతో ఆయన బుధవారంనాడు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తమకు నమ్మకం పోయిందని, శాంతియుత వాతావరణంలో ఉపఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఎన్నికల పరిశీలకులను పంపించాలని కోరామన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు కేంద్ర బలగాలను మొహరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.  ఉపఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఎల్రక్టానిక్‌ మోడ్‌లో నగదు బదిలీని ఆపాలని కోరినట్లు తెలిపారు.   
 

మరిన్ని వార్తలు