సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉండే వారెవరో తేలేది నేడే. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు. మొత్తం 61 మంది నామినేషన్ వేయగా.. స్క్రూటినీ తర్వాత 42 మంది మిగిలారు. బుధవారం 3 గంటల వరకూ నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇప్పటివరకూ నామినేషన్ వేసిన వారిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు.. ఏడు ఇతర పార్టీల నుంచి 32 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
(చదవండి: ఒక్క వాహనం కూడా లేదు..‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?)
ఒక్కో ఈవీఎంలో 16 మంది వివరాలు మాత్రమే పొందు పరిచే అవకాశం ఉంది. ఆ లెక్కన 42 మందిలో సగం మంది వైదొలగినా 21 మంది ఉన్నా కూడా రెండు ఈవీఎంలు తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తుంది. ఒకవేళ 32 మంది పోటీలో ఉంటే నోటాతో కలిపి మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం సాయంత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు.