స్థాయి మరిచి మాట్లాడితే సహించం: కౌశిక్‌రెడ్డిపై నేతల ఫైర్‌

14 Jul, 2021 07:43 IST|Sakshi

కౌశిక్‌రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడితే సహించేది లేదు

కరీంనగర్‌టౌన్‌: కాంగ్రెస్‌ పార్టీని వీడిన కౌశిక్‌రెడ్డికి మాణికం ఠాకూర్, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను విమర్శించేస్థాయి లేదని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చే స్కిప్ట్‌ను చదివి, కాంగ్రెస్‌ నాయకులను విమర్శిస్తే బచ్చాగాళ్లు పెద్దనాయకులు కాలేరని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు వాడుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, జీహెచ్‌ఎంసీ టిక్కెట్లు, పీసీసీ పదవులు ఇప్పిస్తానని, హుజూరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన చరిత్ర కౌశిక్‌ది అని అన్నారు.

దమ్ముంటే రాబోయే ఉప ఎన్నికల్లో స్వతంత్రగా పోటీ చేసి డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్‌ విసిరారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, తదితరులు ఉన్నారు.రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై స్వలాభం కోసమే కౌశిక్‌ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. రేవంత్‌ రెడ్డి, పొన్నంలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు