బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు

26 May, 2021 13:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్ తులా ఉమా, మరికొందరు టీఆర్ఎస్‌ నేతలు త్వరలోనే కాషాయ కండువ కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌తో ఈటల రాజేందర్‌ చర్చలు జరుపుతున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు, ఉద్యమకారులను బీజేపీలో చేరేలా చూస్తానని ఈటల మాట ఇచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే ఈటల చేరికపై బీజేపీ అధిష్టానానికి బండి సంజయ్‌ సమాచారం ఇచ్చినట్లు వినికిడి. అయితే బీజేపీలో చేరే వారి లిస్ట్‌ను బీజేపీ అధిష్టానం అడిగి తీసుకుంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రమేష్ రాథోడ్‌ను బీజేపీలోకి చేర్పించేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా అపాయింట్‌మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి నేతలంతా ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. భూకబ్జా ఆరోపణలతో ఆయన్ను సీఎం కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి తప్పించారు. దీంతో  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇది వరకే చెప్పిన ఈటల.. కొత్త పార్టీ పెడతారా? లేదంటే వేరే పార్టీలో చేరతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు ఈటల రాజేందర్‌పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీలోకి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాలు పలువురు ముఖ్య నేతలతో ఇటల ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారనే విషయం అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

చదవండి: భారీ మద్దతు: మేమంతా ‘ఈటల’ వెంటే..
Etela Rajender: బీజేపీ వైపు ఈటల? 

మరిన్ని వార్తలు