Huzurabad By Poll: వేయి మందితో నామినేషన్‌

16 Aug, 2021 08:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫీల్డ్‌ అసిస్టెంట్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో జరగబోయే ఉపఎన్నికలో వెయ్యి మందితో నామినేషన్‌ వేస్తామని ఫీల్డ్‌ అసిస్టెంట్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పత్యం యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి తెలిపారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇక్కడే మకాం వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆదివారం హుజూరాబాద్‌లోని హైస్కూల్‌ క్రీడా మైదానంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల జేఏసీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్‌లో సర్క్యులర్‌ నెంబర్‌ 4779ని ప్రభుత్వం జారీ చేసిందని, ఆ జీవోను రద్దు చేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉద్యమిస్తే 2020 మార్చిలో విధుల నుంచి తొలగించారని తెలిపారు. 16 నెలలుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉపఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోకపోతే పోటీకి దిగుతామని చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్‌ మండలాల ఫీల్డ్‌ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షులు రమేశ్, శ్రీనివాస్, రవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు