ఈటలను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్‌ను ‘రా’ అంటుండు

11 Aug, 2021 15:49 IST|Sakshi

ఈటలపై మండిపడ్డ హరీశ్‌రావు

కరీంనగర్‌ ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు

సాక్షి, కరీంనగర్‌: ‘‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. ఓటమి భయంతోనే ఈటల మాట తూలుతున్నాడు’’ అంటూ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో.. ఈటల వ్యవహారం అలానే ఉందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరపున హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్‌లో స్వాగతం చూస్తా ఉంటే.. శ్రీనివాస్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని అర్థమవుతుంది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే ఈటెల రాజేందర్.. తనను చూసి ఓటు వేయమంటున్నడు. బీజేపీలో ఉంటు ఆత్మ వంచన చేసుకొని ఆత్మగౌరవం అంటున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదు. పోటీ ఉన్నది టీఆర్ఎ‌స్ పార్టీకి.. బీజేపీకే’’ అని తెలిపారు.

‘‘సిద్దిపేట నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో మహిళా భవనం ఉంది. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఎందుకు లేదు. గేల్లు శ్రీనివాస్ గెలిస్తే ప్రతి గ్రామంలో మహిళ భవనాలు కట్టిస్తం. ఈటల ఆత్మగౌరవం అంటూ.. గడియారాలు, కుట్టు మిషనులు, సెల్ ఫోన్‌లు, టీషర్ట్‌లు పంచుతున్నాడు. అందుకే గడియారాలు నేలకేసి కొడుతున్నారు. ఎకరం అమ్ముత.. ఎలక్షన్ గెలుస్త అన్నాడు.. అమ్మిండు పంచూతా ఉన్నాడు. హుజూరాబాద్‌లో రెండు గుంటల భూమికి.. రెండు వందల ఎకరాలకు మధ్య పోటీ. గేల్లు శ్రీనివాస్‌కు రాష్ట్ర కేబినెట్ ఆశీర్వాదం ఉంది. మీ ఆశీర్వాదం కూడా కావాలి’’ అని ప్రజలను అభ్యర్థించారు హరీశ్‌రావు.
 

>
మరిన్ని వార్తలు