ఈటల గెలుపు బాధ్యత తీసుకున్న కమలనాథులు
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యూహకర్తగా మంత్రాంగం
మండలాల వారీగా ఇన్చార్జిల నియామకం
గులాబీ జెండా ఎగరేసుడే టీఆర్ఎస్ లక్ష్యం
అభ్యర్థి తేలకున్నా.. హంగూ ఆర్భాటాలు
మంత్రులు హరీశ్రావు, గంగుల, కొప్పుల వ్యూహాలు
మండలాల్లో ఎమ్మెల్యేలు, సీనియర్లు
బలమైన అభ్యర్థి కౌశిక్రెడ్డి ఉన్నా.. కనిపించని కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దుబ్బాక.. నాగార్జున సాగర్.. హుజూర్నగర్లలో జరిగిన ఉప ఎన్నికలు హుజూరాబాద్ ముందు దిగదుడుపుగా మారబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు సర్వశక్తులు ఒడ్డేందుకు సన్నద్ధమయ్యాయి. హేమాహేమీలను రంగంలోకి దింపుతున్నాయి. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈటల రాజేందర్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. పార్టీ మారి తిరిగి పోటీ చేయబోతున్న కారణంగా ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏడోసారి విజయం సాధించి తన సత్తా చాటాలని మాజీ మంత్రి ఈటల భావిస్తుండగా, ఈటలను ఓడించడం ద్వారా టీఆర్ఎస్కు ఎదురులేదని మరోసారి చూపించాలని అధికార పార్టీ భావిస్తోంది.
ఈటల అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ఆ పార్టీ యంత్రాంగం హుజూరాబాద్లో మోహరించింది. అదే సమయంలో పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేకపోయినా, టీఆర్ఎస్.. కేసీఆర్ పేరుతో ఆ పార్టీ జనంలోకి వెళ్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే మండలాల్లో మోహరించారు. త్వరలో గ్రామాలకు కూడా బడా నాయకులు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈటల టార్గెట్గా టీఆర్ఎస్ వ్యూహం
టీఆర్ఎస్ను వీడి, ఎమ్మెల్యేకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ను తిరిగి అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే లక్ష్యంతో గులాబీ దళం పావులు కదుపుతోంది. మంత్రులు టి.హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇతర ముఖ్య నాయకులు హైదరాబాద్లో ఇప్పటికే పలుమార్లు సమావేశమై హుజూరాబాద్ ఉప ఎన్నికలో అమలు చేసే వ్యూహాలపై చర్చించారు. ఈటల మంత్రిగా బర్తరఫ్ అయిన వెంటనే ఆయనకు మద్దతుగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లకుండా చూడడంలో మంత్రి గంగుల సక్సెస్ అయ్యారు.
నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్ పనుల పరిష్కారం, ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించి మంత్రి హరీశ్, మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్సీ వర్గాలను ఆకర్షించడంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తన అనుభవాన్ని వినియోగించారు. మొదటి దశలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తూనే రెండోదశలో మండలాలు, గ్రామాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు సమాయత్తమవుతున్నారు.
టీఆర్ఎస్తో బీజేపీ సై
అభ్యర్థి ఉన్నా.. కనిపించని కాంగ్రెస్..