‘అపోహలు‌ ఉంటే పాకిస్తాన్‌లో వ్యాక్సిన్‌ వేయించుకోండి’

13 Jan, 2021 17:43 IST|Sakshi

బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

మీరట్‌: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్దమవుతున్న తరుణంలో పలు ముస్లిం సంస్థల ఆందోళనల నేపధ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌లో పంది కొవ్వు ఉందనే దానిపై కొన్ని ముస్లిం సంస్థలు చేస్తున్న ఆందోళనలపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ..  భారత దేశాన్ని విశ్వసించకపోతే, ఆందోళలను చేసే వారు పాకిస్తాన్‌కు వెళ్ళవచ్చని అన్నారు. త్వరితగతిన టీకాను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచ దేశాలన్నీ భారతను అభినందిస్తుంటే, భారత్‌లోనే నివసించే ముస్లిం సంస్థలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం విచారకరమని సోమ్‌ పేర్కొన్నారు. భారత్‌లో తయారయ్యే వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు ప్రపంచ దేశాలన్నీ సన్నద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంకా ఎవరికైనా వ్యాక్సిన్‌పై అపోహలుంటే వారు పాక్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ను వేయించుకోచ్చని సలహా ఇచ్చారు. కాగా, భారత్‌లో తయారయ్యే వ్యాక్సిన్‌లో పంది కొవ్వు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. 

మరిన్ని వార్తలు