పీఓకేలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ విజయం

27 Jul, 2021 11:51 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌–బల్టిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ విజయం సాధించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 45 సీట్లకుగానూ 25   సీట్లను పీటీఐ గెలుచుకుంది. దీంతో ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సీట్లు పీటీఐ గెలుచుకున్నట్లు అయింది. పీఓకేలో ఇమ్రాన్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోవడం ఇదే మొదటిసారి.

పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 11 సీట్లను, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) 6 సీట్లను గెలుచుకోగా.. ముస్లిం కాన్ఫరెన్స్‌ (ఎంసీ), జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ పార్టీ (జేకేపీపీ)లు చెరో సీటును గెలుచుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్‌ కారణంగానే ఇమ్రాన్‌ పార్టీ గెలిచిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అయితే ఆయా పార్టీలు తమను నిందించే బదులు వారి పనితీరును పరిశీలించుకోవాలంటూ పీటీఐ తిప్పికొట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్‌ గతంలోనే తప్పుబట్టింది. ఆయా ఎన్నికలకు న్యాయ ప్రాతిపదిక లేదంది.
 

మరిన్ని వార్తలు