జూడాల సమస్యలను పరిష్కరించాలి: ఇందిరాశోభన్

26 May, 2021 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లను తెలంగాణ సర్కార్ విస్మరించడం సరికాదని వైఎస్‌ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జూడాలకు 10 శాతం ఇంటెన్సివ్ ఇస్తానన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందన్నారు. వేతనాల పెంపుపై గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కరోనా బారిన పడ్డ జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలన్నారు.

కరోనా పేషంట్లకు చికిత్స చేస్తున్న వారి ఆరోగ్యానికే భద్రత లేకుండా ఎలా అని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసుపై ఆరా తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ రోజే వాళ్లని పిలిచి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జూడాలను చర్చలకు ఆహ్వానించి.. సమ్మెను విరమింపజేయాలన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పంతాలకు పోకుండా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

చదవండి: ‘కేసీఆర్.. మీది గుండెనా.. బండనా..?: వైఎస్‌ షర్మిల
సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు