బార్‌ల నుంచి రాని కరోనా బడిలో వస్తుందా?

10 Jul, 2021 11:59 IST|Sakshi

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల

సాక్షి, పంజగుట్ట (హైదరాబాద్‌): రాష్ట్రంలో బార్‌లు ఆఫ్‌లైన్‌ నడుస్తుండగా విద్యా సంస్థలు మాత్రం ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయని, బార్‌లో రాని కరోనా బడిలో ఎలా వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. ఆన్‌లైన్‌ విద్య వల్ల సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు లేక గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో ఆన్‌లైన్‌ విద్య–బడుగు విద్యార్థుల అవస్థలు భవిష్యత్‌ కార్యాచరణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ ముదిరాజ్, కేంద్రకమిటీ సంఘం అధ్యక్షుడు విక్రమ్‌ గౌడ్‌ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాజుల మాట్లాడారు. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నారని వారికి ఏడాది కాలంగా మిడ్‌డే మీల్స్‌ ఇవ్వడంలేదని, ఆ డబ్బుతో విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు ఇప్పించవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థలు తెరవని పక్షంలో 24 గంటల దీక్ష, చలో హైదరాబాద్‌ అవసరమైతే సెక్రటేరియట్‌ ముట్టడి చేస్తామని జాజుల హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు