Pawan Kalyan: ఘటనతో నాకు సంబంధం లేదు

17 Oct, 2022 03:51 IST|Sakshi

పోలీసుల నోటీసుకు పవన్‌ సమాధానం 

సాక్షి, విశాఖపట్నం :  పోలీసు యాక్ట్‌–30 అమల్లో ఉన్నా శనివారం విశాఖ విమానాశ్రయం నుంచి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై ఆదివారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులిచ్చారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించ కూడదని, ఎవరైనా సరే ముందస్తు అనుమతి తీసుకోవాలని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్రన్‌ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

మీ నాయకత్వంలోని జనసేన మద్దతుదారులు మంత్రులపై దాడులు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించారని పేర్కొన్నారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ ‘మీ నోటీసులను నేను అంగీకరిస్తున్నాను. అయితే, విమానాశ్రయంలో సంఘటనతో నాకు సంబంధం లేదు’ అని స్వదస్తూరితో సమాధానం ఇచ్చారు. ఇదే ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న, కేసులు పెట్టిన తమ వారిని వదిలి పెట్టాలని, అప్పటి వరకు తాను విశాఖ వదలనని పవన్‌ స్పష్టం చేయడం పట్ల జనం విస్తుపోతున్నారు.

‘విమానాశ్రయంలో జరిగిన ఘటనతో నిజంగా పవన్‌కు సంబంధం లేకపోతే.. అందుకు కారకులపై కేసులు పెడితే ఆయన ఎందుకు స్పందించాలి?  మంత్రుల కార్లపై దాడి జరిగినందున పోలీసుల చర్యలుంటాయి. ఇది తెలిసి కూడా వాళ్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేయడం చూస్తుంటే పవన్‌ అంతర్యమేంటో ఇట్టే తెలుస్తోంది’ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. (క్లిక్‌: పవన్‌కు చంద్రబాబు ఫోన్‌)  

మరిన్ని వార్తలు