2024లో బీజేపీకి 2 సీట్లే.. ఎక్కడ మొదలయ్యారో తిరిగి అక్కడికే: జేడీయూ

4 Sep, 2022 18:09 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో ఎన్‌డీయే కూటమికి టాటా చెప్పి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్‌ యునైటెడ్‌(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్‌ కుమార్‌ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌(లలన్‌ సింగ్‌). బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకేనన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 పార్లమెంటరీ స్థానాల్లో జేడీయూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు. 

మరోవైపు.. బీజేపీకి 2024 ఎన్నికల్లో 50 సీట్లు మాత్రమే వస్తాయని శనివారం ఓ సమావేశం వేదికగా అంచనా వేశారు జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్‌ కుమార్‌. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ‍్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఇదీ చదవండి: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు