మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. నా చివరి రక్తపుబొట్టువరకు పోరాడుతా

27 Aug, 2022 15:35 IST|Sakshi

రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్‌లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. 

అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్‌కు తరలించారు సోరెన్‌. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్‌కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్.

మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్‌కు 18, ఆర్‌జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది.
చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్‌.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు

>
మరిన్ని వార్తలు