కుప్పంలోనే కుదేలయ్యావ్‌.. పులివెందులలో ఏం చేస్తావు?

4 Sep, 2022 04:08 IST|Sakshi

చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్‌ మండిపాటు 

సెప్టెంబర్‌ 1ని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి 

డిసెంబర్‌ నాటికి డీబీటీ ద్వారా రూ.2 లక్షల కోట్ల సాయం

సాక్షి, అమరావతి: కుప్పంలో వరుస ఓటములతో కుదేలైన చంద్రబాబు.. పులివెందులకు వెళ్లి ఏమి పీకుతారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. సీఎం జగనన్న ఇలాకాను టచ్‌ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని లాక్కున్న సెప్టెంబర్‌ ఒకటో తేదీన చంద్రబాబు పండుగ చేసుకుంటున్నారని, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సెప్టెంబర్‌ ఒకటో తేదీని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వల్లకాటికి వెళ్లిపోతున్న టీడీపీని తాళ్లు, బుల్డోజర్లు, జేసీబీలతో లేపాలని పచ్చపత్రికలు, చానళ్లు విశ్వప్రయత్నం చేస్తున్నాయని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యమన్నారు. సెప్టెంబర్‌ రెండో తేదీ వైఎస్సార్‌ వర్ధంతి నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం... అంటూ చంద్రబాబు డ్రామా మొదలు పెట్టారన్నారు. మంత్రి జోగి రమేష్‌ ఇంకా ఏమన్నారంటే.. 

స్టేలు విత్‌ డ్రా చేసుకునే దమ్ముందా? 
► రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బాబు మాట్లాడుతున్నాడు. దమ్ముంటే, సత్తా ఉంటే ఆ అవినీతిని నిరూపించాలని ఛాలెంజ్‌ చేస్తున్నా. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ప్రజలకు అందించే సాయం వచ్చే డిసెంబర్‌ నాటికి రూ.2 లక్షల కోట్లకు చేరుతుంది. ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్లు ప్రజలకు చేరాయి.   
► శ్యాండ్, మైన్, వైన్‌ దోపిడీ జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. అవినీతి మీద కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. స్టేలు విత్‌ డ్రా చేసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? సీబీఐ విచారణ జరిగితే బాబు జైలుకు వెళ్లడం ఖాయం.  
► డాక్టర్‌ వైఎస్సార్‌ను ప్రజల గుండెల నుంచి చంద్రబాబు తొలగించలేడు. ఆ మహనీయుడి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, 108, 104, పేదలకు ఇళ్లు.. వంటి పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు 14 ఏళ్ల  పాలనలో ఒక్కటి కూడా చెప్పుకోదగిన పథకం లేదు.  

ఈసారి ఒక్క స్థానం కూడా రాదు 
► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున సంస్థలు ముందుకు వస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఏపీ పారిశ్రామికంగా వెనుకబడిందని మాట్లాడటం దారుణం. సంక్షేమాభివృద్ధిని చూసి తట్టుకోలేక కడుపు మంట ఎక్కువైంది. అచ్చెన్న, బుచ్చెయ్య, గాలి, ధూళి, పయ్యావుల.. వీళ్లంతా ఎంతగా గొంతు చించుకున్నా, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌ ప్రజా బలానికి కొట్టుకుపోతారు.  
► చంద్రబాబుకు అధికారంలో ఉంటే దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. అదే మేము.. ఫలానా పనులు చేశామంటూ నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి ధైర్యంగా చెబుతున్నాం. సమస్యలుంటే పరిష్కరిస్తున్నాం. చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా? బాబు దగాకోరు పాలన చూసిన ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారు. అయినా తీరు మారనందుకే వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాదు... అని జోగి రమేష్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు