మజ్లిస్‌ ఎంపీతో ‘బండి’కి ఏం పని?

26 Aug, 2022 03:47 IST|Sakshi

కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌

కరీంనగర్‌: ‘ఔరంగాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు ఏం పని? అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో చెప్పాలి’ అని కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో మాటల యుద్ధాలే ఉండాలి తప్ప ప్రత్యక్ష దాడులకు తావులేదన్నారు. ఎమ్మెల్సీ కవిత సీఎం కూతురు అయినందునే ఆమెను లక్ష్యంగా చేసుకొని ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారని ఆరోపించారు.

ఎంపీ బండి సంజయ్‌పైనా అనేక ఆరోపణలు ఉన్నాయని, అలాగని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ఇంటి ముందు ధర్నా చేశాయా? అని ప్రశ్నించారు. ఔరంగాబాద్‌ మజ్లిస్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ను బండి సంజయ్‌ ఎందుకోసం కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఇంతియాజ్‌ జలీల్‌కు బండి సంజయ్‌ చార్మినార్‌ ప్రతిమను అందిస్తున్న ఫొటోను విలేకరుల ముందు ప్రదర్శించారు. కరీంనగర్‌ ప్రజలను విభజించాలనుకోవడం దుర్మార్గమన్నారు. 

మరిన్ని వార్తలు