Karimnagar: ముదిరిన ఎంపీ.. సీపీల వివాదం.. ఢిల్లీకి గల్లీ లొల్లి!

21 Jan, 2022 14:30 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌.. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ మధ్య వివాదం ముదిరింది. నగరంలోని ఎంపీ కార్యాలయం ఉన్న చైతన్యపురి గల్లీలో మొదలైన వివాదం.. ఢిల్లీలోని ప్రివిలేజ్‌ కమిటీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంలో శుక్రవారం సంజయ్‌ పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. 317 జీవో సవరణకు సంజయ్‌ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు అతడిని అరెస్టు చేసిన వి షయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు బీజేపీ కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి, తన గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని సంజయ్‌ ఆరోపించారు.


సంబంధిత వార్త: సీపీ నా గల్లా పట్టుకున్నారు: బండి సంజయ్‌

ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ, పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఆయన ఈ– మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్‌ కమిటీ హోంశాఖ కార్యదర్శిని రిపోర్టు అడిగిందని స మాచారం. హోంశాఖ కార్యదర్శి తెలంగాణ డీ జీపీ, సీఎస్‌ను నివేదిక కోరారని తెలిసింది. ని వేదికలు ఇప్పటికే ప్రివిలేజ్‌ కమిటీకి చేరాయని సమాచారం. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు దాడి చేశారని, అరెస్టు సందర్భంగా హద్దుదాటి వ్యవహరించారని సంజయ్‌ ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ కట్టర్లతో ఎంపీ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రివిలేజ్‌ కమిటీకి ఇ చ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై పోలీసులు అకారణంగా లాఠీచార్జీ చేశారని వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే పలు ఫొటోలు, వీడియోలు, న్యూస్‌ క్లిప్పింగులతో కూడిన ఫైల్‌ను కమిటీకి సంజయ్‌ సమర్పించనున్నారని సమాచారం. 
చదవండి: జాగ‘రణం’.. బండి సంజయ్‌ దీక్ష భగ్నం

సీపీతోపాటు ముగ్గురికి నోటీసులు!?
ఎంపీ సంజయ్‌ ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీతోపాటు ముగ్గురు పోలీసుల అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. కరీంనగర్‌ పోలీసులపై సంజయ్‌ పార్లమెంటు కు ఫిర్యాదు చేయ డం రెండోసారి కావడం గమనార్హం. అది కూడా ప్రస్తుత సీపీ సత్యనారాయణపైనే. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఓ ఆర్టీసీ కార్మికుడి శవయాత్రలో పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని బండి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్పటి సీపీ కమలాసన్‌రెడ్డి సెలవులో ఉ న్నారు. ఆ సమయంలో రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణ కరీంనగర్‌కు ఇన్‌చార్జి సీపీగా వ్యవహరించారు. అప్పుడూ ఎంపీ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య వృత్తిగతంగా విభేదాలు రావడం ఇది రెండోసారి కావడం విశేషం.

సీనియర్లకు వివరణతో సరి..!
మరోవైపు ఇటీవల సంజయ్‌కి వ్యతిరేకంగా అ సమ్మతి రాగాలు పలికిన సీనియర్ల విషయంలో అధిష్టానం స్పష్టమైన వైఖరితోనే ఉంది. ఈ వ్య వహారంపై సీనియర్‌ నాయకుడు నల్లు ఇంద్రసే నారెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిపై అసమ్మతి గళం విషయంలో తొలుత సీనియర్లను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం. వారి వివరణలు వినాలని, వాటితో సంతృప్తి చెందకపోతే అపుడు నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సీనియర్‌ నేతలు సుగుణాకర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు సమావేశం నిర్వహించడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం వెంటనే అసమ్మతి నిప్పును ఆర్పేందుకు చర్యలు చేపట్టింది.

బీసీ కమిషన్‌ ఎదుట సీపీ వివరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఈనెల 2న నిర్వహించిన జాగరణ దీక్షను భగ్నం చేసిన ఘటనలో సీపీ సత్యనారాయణ జాతీయ బీసీ కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజ్‌ ఆచారీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎంపీ సంజయ్‌ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ జనసమీకరణతో దీక్ష తలపెట్టిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీక్షకు అనుమతి లేదని, కోవిడ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో దీక్షను రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రోజు ఉదయం బీజేపీ నాయకులకు నోటీసులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. అయినా దీక్ష కొనసాగించడంతో అరెస్టు చేయాల్సి వచ్చిందని సీపీ సత్యనారాయణ వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు