సీఎం మార్పు కోసం ఆగని యత్నాలు

13 Jun, 2021 02:44 IST|Sakshi

మళ్లీ ఢిల్లీకి యడ్డి వ్యతిరేకులు

సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని బీజేపీ అధిష్టానం పెద్దలు చెప్పినా ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి యడియూరప్పకు వ్యతిరేకంగా ఆయన విరోధి వర్గం తెరవెనుక మంతనాలు, కార్యాచరణను కొనసాగిస్తూనే ఉంది. బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లద్‌ ఢిల్లీ పర్యటన పలు అనుమానాకు తావిచ్చింది. శుక్రవారం యడియూరప్ప మాట్లాడుతూ రానున్న రెండేళ్లు తానే సీఎంనని ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. సీఎం ప్రకటన తరువాత శనివారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు అరవింద బెల్లద్‌ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది.  


పార్టీ ఇన్‌చార్జ్‌ రాకపై దృష్టి  
యడియూరప్పను వ్యతిరేకించే ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దలను కలసి త్వరలో శాసనసభపక్ష భేటీ ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయాలని కోరారు. ఈ నెల 16 లేదా 17న కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌ అరుణ్‌ సింగ్‌ జరిపే రాష్ట్ర పర్యటనలో యడియూరప్పను మార్చాలని వ్యతిరేకవర్గం పట్టుబట్టనుంది. తన ఢిల్లీ పర్యటనలో పూర్తిగా వ్యక్తిగతమని ఎమ్మెల్యే అరవింద బెల్లద్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు