సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్‌ అస్త్రం!

21 Sep, 2022 11:19 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్‌ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్‌ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్‌’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్‌ ప్రారంభించింది.  

కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్‌ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్‌ను ఎత్తిచూపేలా ఈ వెబ్‌సైట్‌, పోస్టర్లను డిజైన్‌ చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్‌. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్‌తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ‍ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.

ఇదీ చదవండి: ‘భారత్‌ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్‌

మరిన్ని వార్తలు