మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత

4 Oct, 2020 12:59 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మంత్రివర్గంలోని కీలక సభ్యుడు సీటీ రవి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం రాత్రి సీఎంకు పంపించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటన మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల బీజేపీ అధిష్టానం ప్రకటించిన ఆ పార్టీ జాతీయ కమిటీలో సీటీ రవికి కీలక బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పోస్టింగ్‌ లభించింది. ఈ క్రమంలోనే మంత్రిపదవికి రాజీనామా సమర్పించిన రవి.. సోమవారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. జాతీయ రాజకీయాల్లో రావాలన్న పార్టీ పిలుపుమేరకు కేబినెట్‌ నుంచి వైదొలినట్లు తెలుస్తోంది. కాగా రవి ఇటీవల కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న విషయ తెలిసిందే. (అసెంబ్లీలో అవిశ్వాస రణం)

మరోవైపు తాజా రాజీనామా నేపథ్యంలో యడియూరప్ప మంత్రివర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన బీజేపీలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని సీనియర్లు సైతం పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న కొద్ది రోజుల్లోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే వార్తలు కన్నడనాట బలంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు