టికెట్‌కి వెల కడతారా?.. ఆ రెండు నియోజకవర్గాలు వదిలే ప్రసక్తే లేదు

10 Dec, 2022 18:26 IST|Sakshi

పచ్చపార్టీ బాస్ డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఇవ్వడని తెలిసిందే. ఎన్నికల్లో కూడా కార్యకర్తల మద్దతు ఉన్నవారికంటే డబ్బున్నవారికే ప్రాధాన్యమిస్తారు చంద్రబాబు. ఇప్పుడు ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కూడా ఒక అనామకుడికి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చారంటూ కేడర్‌లో నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ అధ్యక్షుడ తీరుపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. బాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందిపడుతున్న నేత ఎవరో మీరే చదవండి.

ఆక్ పాక్ కరివేపాక్‌
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు మీద మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తమ కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా తీసేసారని కేఈ కుటుంబం మదనపడుతోంది. చంద్రబాబు తమను సంప్రదించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండా డోన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు ధర్మవరం సుబ్బారెడ్డికి అప్పగించడం కెఇ కుటుంబం ఆందోళన చెందుతోంది. మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ పుట్టిన రోజున తెలుగు తమ్ముళ్లు సెలబ్రేషన్స్ జరిపారు. ఇదే అవకాశంగా భావించిన కెఇ ప్రభాకర్ చంద్రబాబుపై ఘాటుగా స్పందించారు.

చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్‌)

డోన్ టికెట్కు వెల కడతారా?
ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు నిర్నయాన్ని నేరుగా తప్పుపట్టారు కేఈ ప్రభాకర్. ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి వెళ్ళాలంటే రాజకీయంగా అనుభవం ఉండాలి, కనీసం వార్డ్ మెంబర్గా కూడా అనుభవం లేని వ్యక్తిని.. కేవలం డబ్బున్నదన్న ఒకే కారణంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటూ మండిపడ్డారు. తమను పక్కన పెట్టి వేరే వ్యక్తిని అక్కడ నిలబెట్టడం ఏమాత్రం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి స్పష్టంగా చెప్పేశారు ప్రభాకర్. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న కుటుంబాన్ని కాదని కేవలం డబ్బును చూసి తీసుకువస్తారా అంటూ అసహనం వ్యక్తంచేశారు.

ఏ బాబు మాట విననంటే వినను
అసలే పడిపోయిన పచ్చ పార్టీ ప్రతిష్టను చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మరింత లోతుకు నెట్టేస్తున్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. చంద్రబాబు ఎవరిని తీసుకువచ్చినా.. తమకు సీటివ్వకపోయినా.. పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తమ కుటుంబం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించి తమ బాస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు ప్రభాకర్.

- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు