సిసోడియాపై సీబీఐ దాడులతో మా ఓట్‌ షేర్‌ పెరిగింది: కేజ్రీవాల్‌

1 Sep, 2022 14:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకల ఆరోపణలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసాలు, బ్యాంకు లాకర్లపై దాడులు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీబీఐ దాడులను సూచిస్తూ మరోమారు బీజేపీపై విమర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికతో వారికే ఎదురుదెబ్బ తగలనుందన్నారు. 

‘మనీశ్‌ సిసోడియాపై దాడులు జరిగిన తర్వాత గుజరాత్‌లో ఆప్ ఓటు షేర్‌ 4 శాతం పెరిగింది. ఆయన అరెస్ట్‌ అయితే అది 6 శాతానికి చేరుతుంది.ఆపరేషన్‌ లోటస్‌ విఫలమవుతుందని చెప్పేందుకే ఈ రోజు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారటం లేదు. నా పిల్లలిద్దరు ఐఐటీలో చదువుతున్నారు. భారత్‌లోని ప్రతి పిల్లాడికి అలాంటి విద్య అందించాలనుకుంటున్నాను. అవినీతి పార్టీలో విద్యావంతులు లేరు. కానీ, నిజాయితీతో పని చేసే పార్టీలో మంచి విద్య, నిజమైన ఐఐటీ పట్టభద్రులు ఉన్నారు.’ అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటింగ్‌లో 62 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు గానూ 58 మంది అనుకూలంగా ఓటు వేశారు. ముగ్గురు గైర్హాజరవగా.. అందులో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. మరో నేత సత్యేంద్ర జైన్‌ జైలులో ఉన్నారు. ఒకరు స్పీకర్‌.

ఇదీ చదవండి: ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్‌ సర్కార్‌

మరిన్ని వార్తలు