బాబు బొమ్మను పీకేసిన కేశినేని

18 Oct, 2021 03:19 IST|Sakshi
గతంలో కేశినేని కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీ, తాజాగా రతన్‌ టాటాతో కలిసి దిగిన ఫొటోను ఏర్పాటు చేసిన కేశినేని

ఆ స్థానంలో రతన్‌టాటా చిత్రపటం  

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని తన కార్యాలయం బయట గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని తాజాగా పీకేయించి, అదే స్థానంలో రతన్‌టాటాతో కలిసి ఉన్న తన ఫొటోను ఏర్పాటు చేశారు. కేశినేని భవన్‌ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను కూడా తొలగించేశారు.

వాటి స్థానంలో టాటా ట్రస్టు, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫొటోలను ఉంచారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కేశినేని రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తికర చర్చలు జోరందుకున్నాయి. టీడీపీకి పూర్తిగా దూరం కానున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? లేక సుజనా చౌదరి, సీఎం రమేష్‌ తదితరులను బీజేపీలోకి సాగనంపినట్లే కేశినేనికి కూడా బాబే దారి చూపుతున్నారా? అనే విషయాలపై స్వపక్షీయుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.  

     

మరిన్ని వార్తలు