నాపై కాదు.. పార్టీ పటిష్టతపై దృష్టి సారించండి

22 Jul, 2022 03:26 IST|Sakshi

సోషల్‌ మీడియాలో సొంత పార్టీ నేతలకు టీడీపీ ఎంపీ కేశినేని నాని చురకలు

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో ముక్కుసూటి మనిషిగా పేరున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో ఆఫ్‌ ది రికార్డు మాట్లాడుతూ.. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. దానికి కొనసాగింపుగా గురువారం రాత్రి టీడీపీ అధిష్టానాన్ని, నాయకులను ఉద్దేశిస్తూ తన మనసులోని మాటను ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్నారు. ‘యదార్ధవాది.. లోక విరోధి అనే సామెత గుర్తు వస్తోంది.

నన్ను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకొని.. పార్టీని పటిష్టపరచుకొని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది’ అంటూ కేశినేని నాని పార్టీ నాయకత్వానికి చురకలంటించారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ తరచూ టీడీపీలో లోపాలు, బలహీనతలను నాని వేలెత్తి చూపుతున్నారు. సొంత పార్టీలోనే తనను దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడుతూ ఆయన ఈ పోస్టు చేయడం గమనార్హం.   

మరిన్ని వార్తలు