అంత పెద్ద సినిమా ఉంటే న్యాయ స్థానానికి ఎందుకెళ్లలేదు.. కిషన్‌ రెడ్డి కౌంటర్‌ అటాక్‌

30 Oct, 2022 18:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చండూరు సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ పాత రికార్డునే చండూరు సభలో ప్లే చేశారని విమర్శించారు. అభద్రతాభావం, అపనమ్మకం కేసీఆర్‌లో కనిపించిందని అన్నారు. కేసీఆర్‌ పరోక్షంగా ఓటమిని అంగీకరించారని చెప్పారు. ఆరోపణలు, హామీలపై కేసీఆర్‌ అవాస్తవాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేరాఫ్‌ అడ్రస్‌ కేసీఆర్‌ కుటుంబమేనని, టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు.

నలుగురు హీరోలని కేసీఆర్‌ చెబుతున్న నేతల పార్టీ ఫిరాయించిన వారేనని గుర్తు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు.  40 లక్షల ట​​ర్నోవర్‌ వరకూ ఏ రకమైన జీఎస్టీ లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. జీఎస్టీ టారిఫ్‌ నిర్ణయించింది కేంద్రం కాదని.. జీఎస్టీ కౌనిల్స్‌ అని తెలిపారు. చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే జీఎస్టీ కౌన్సిల్‌లో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.

‘వాజ్‌పేయి తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్లోఐరైడ్‌ సమస్యను పూర్తిగా పక్కన పెట్టింది. మోదీ ప్రభుత్వం ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి రూ. 800 కోట్లు ఖర్చు చేసింది. యూపీఏ మయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. అప్పుడెందుకు మాట్లాడలేదు?. 32 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్‌ లాక్కున్నారు. ఈ తొమ్మిదేళ్లలో మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఇదే మునుగోడు ఎన్నికల సభలో గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మీ దగ్గర అంత పెద్ద సినిమా ఉంటే ఎందుకు న్యాయ స్థానానికి వెళ్లలేదు. మీరు చేసే కుంభకోణాలు కప్పించుకోవడానికే సీబీఐని అడ్డుకున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
చదవండి: 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు